బాలకృష్ణ పొలిటికల్ ఎంట్రీకి కాంగ్రెసు ట్విస్టు
హైదరాబాద్: రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని బాలకృష్ణ చేసిన ప్రసంగానికి కాంగ్రెసు పార్టీ కొత్త రకం ట్విస్టు ఇస్తోంది. పార్టీ కార్యకర్తలకు తనది పూచీ అంటూ చివరి రక్తం బొట్టు వరకు సేవ చేస్తానని బాలకృష్ణ చేసిన ప్రసంగాలు కాంగ్రెసు పార్టీ చేతికి కొత్త అస్త్రాన్ని అందించినట్లే కనిపిస్తున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి కాంగ్రెసు పార్టీ కొత్త రకం విమర్శలు ప్రారంభించింది. బావ చంద్రబాబు ఆదరణ పలచబడి పోవడంతో తాను ముఖ్యమంత్రిని అవుదామని బావమరిది బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెసు ఎమ్మెల్సీ రంగా రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆదరణ కోల్పోయారని కూడా రంగారెడ్డి చెప్పదలుచుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి బాలకృష్ణ వచ్చినంత మాత్రాన కాంగ్రెసు పార్టీకి జరిగే నష్టమేమీ లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని బాలకృష్ణ చేసిన ప్రకటనను కూడా రంగారెడ్డి ఎదురు కొట్టారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో బాలకృష్ణ తెలంగాణలోని ఏదో ఒక సీటు నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఓ సలహా ఇచ్చేశారు. తెలంగాణలో బాలకృష్ణ పోటీ చేయబోరని, పోటీ చేస్తే ఎదురుదెబ్బ తప్పదని చెప్పడానికే ఆయన మాటలన్నారని అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ హయాంలోనే 1989 ఎన్నికల్లో కాంగ్రెసు అధికారంలోకి రాగలగిందని, కొత్తగా బాలకృష్ణ వచ్చినంత మాత్రాన కాంగ్రెసు భయపడే పరిస్థితి లేదని ఆయన అన్నారు. మొత్తం మీద, బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల ప్రస్తావన రాజకీయాల్లో చర్చనీయాంశంగానే మారింది.
