జూ.ఎన్టీఆర్కు చెక్: బాలయ్యను తోసిన బాబు
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని హీరో బాలకృష్ణ చేసిన ప్రకటన వెనక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తన బావమరిది హరికృష్ణకు, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్కు చెక్ పెట్టేందుకు చంద్రబాబు అందుకు పూనుకున్నట్లు చెబుతున్నారు. బాలకృష్ణ ముందుకు వస్తే పార్టీ వ్యవహారాలు తన చేయి జారకుండా ఉంటాయనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. చంద్రబాబు వ్యూహంలో భాగంగానే బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడారని పార్టీ నాయకులు భావిస్తున్నప్పటికీ ఇంత అకస్మాత్తుగా ఆ అవసరం ఏమి ఏర్పడిందనేది వారికి అర్థం కావడం లేదు.
స్టూడియో ఎన్ వ్యవహారం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఏ మాత్రం మెతగ్గా వ్యవహరించడానికి చంద్రబాబు సిద్ధంగా లేరనే మాట వినిపిస్తోంది. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ చేతుల్లోంచి స్టూడియో ఎన్ టీవి చానెల్ను జూనియర్ ఎన్టీఆర్ తీసేసుకున్నారు. దీంతో చంద్రబాబుకు, జూనియర్ ఎన్టీఆర్కు మధ్య సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టాయి. ఈ స్థితిలో బాలకృష్ణ ద్వారా మాత్రమే జూనియర్ ఎన్టీఆర్కు బ్రేకులు వేయడానికి సరిపోతారని, బాలకృష్ణ వల్ల మాత్రమే తనకు ఏ విధమైన డోకా ఉండదని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించినా బాలకృష్ణ నుంచి వ్యతిరేకత రాదనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు.
బాలకృష్ణ సహకారం వల్ల ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో అతి ముఖ్యమైన వ్యక్తి తన వైపు ఉన్నట్లు కూడా చూపించుకోవడానికి వీలవుతుందని ఆయన అనుకుంటున్నారు. బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని తన కుమారుడు లోకేష్కు ఇచ్చి వివాహం చేయడం వల్ల వారిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. అయితే, బాలకృష్ణ నుంచి కూడా చంద్రబాబుకు ప్రమాదం ఉంటుందని కొంత మంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో ఓడిపోయినందున పార్టీని బాలకృష్ణ తన చేతుల్లోకి తీసుకోవచ్చునని అంటున్నారు.
