ఎన్నికల్లో పోటీ చేస్తే బాలయ్యను గెలిపిస్తా: హరికృష్ణ
హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేస్తే తన సోదరుడు, పార్టీ నాయకుడు బాలకృష్ణను గెలిపించడానికి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ చేసిన ప్రకటనపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల వద్ద ప్రతస్పందించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆయకట్టు అంటే ఏమిటో తెలియని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర దౌర్భాగ్యమని ఆయన అన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే అర్హత కాంగ్రెసుకు లేదని ఆయన అన్నారు. భద్రత లేకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గ్రామాల్లో తిరగగలరా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు అండగా నిలబడాలని తాము పార్టీ స్థాపించామని, తాము రైతు బిడ్డలమని, రైతుల కోసం పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
పంటలు నష్టపోయి రైతులు తీవ్రంగా దెబ్బ తిన్నారని ఆయన అన్నారు. ఆడపడుచుల పసుపు కుంకుమలను ప్రభుత్వం తుడిచేసిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. రైతులకు కాంగ్రెసు పార్టీ నాయకులు కల్లిబొల్లి కబుర్లు చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేశారని ఆయన అన్నారు. వ్యవసాయం తెలియని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని, ధాన్యం అంటే ఏమిటో కూడా కిరణ్ కుమార్ రెడ్డికి తెలియదని, ధాన్యం దేనికో పండుతుందని అనుకుంటున్నాడని, పండడానికి ధాన్యం చెట్టుకు కాసే కాయలు కావనే విషయం ముఖ్యమంత్రికి తెలియదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
