My Dream to Become Heroine, No Worry for Remunarations
బాలీవుడ్ సంచలన దర్శకుడు మధుర్భండార్కర్ కలల ప్రాజెక్ట్ ‘హీరోయిన్’ అర్థాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఐశ్వర్యరాయ్ కథానాయికగా ఈ సినిమాని ప్రారంభించిన మధుర్ కొన్ని నెలల క్రితం ఆమె ప్రెగ్నెట్ అని తెలియడంతో ప్రాజెక్ట్ ను నిలిపివేశాడు. దాదాపు అరవైశాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం నుంచి ఐశ్వర్య తప్పుకోవడంతో ఈ సినిమా భవిష్యత్తు సందిగ్ధంలో పడినట్లెంది. ఎట్టకేలకు కరీనాకపూర్ ను కథానాయికగా ఎంచుకొని ఈ సినిమాని పునఃప్రారంభించాడు దర్శకుడు మధుర్ భండార్కర్. ఇటీవలే ఈ చిత్రం ముంబయ్ లో తిరిగి ప్రారంభమైంది. హీరోయిన్స్ జీవితాల్లోని చీకటి కోణాల్ని, వారి తెర చాటు జీవితాన్ని ఆవిష్కరిస్తూ మధుర్ రూపొందించనున్న ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండటంతో కరీనా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. తన కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయే పాత్ర అని గర్వంగా చెబుతోంది.
ఈ చిత్రానికి కరీనా 10 కోట్ల పారితోషికంతో పాటు చిత్ర లాభాల్లో వాటాను కూడా తీసుకోనుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై కరీనా తనదైన శైలిలో స్పందించింది...‘నా కేరీర్లో హీరోయిన్ చిత్రం ఎంతో ప్రత్యేకం. హీరోయిన్స్ జీవితం తాలూకూ మనకు తెలియని, ఊహించని ఎన్నో విషయాల్ని దర్శకుడు మధుర్ భండార్కర్ ఈ చిత్రంలో మన కళ్లముందుంచుతున్నాడు. ఈ సినిమాకి నేను తీసుకుంటున్న పారితోషికం ఎంతన్నది సమస్యకాదు...నేను కలలు గన్న డ్రీమ్ రోల్ ఇది. ఈ సినిమా విషయంలో పారితోషికం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు’ అని సమాధానమిచ్చింది. దర్శకుడు మధుర్భండార్కర్ కూడా హీరోయిన్ సినిమాకి కరీనా రైట్ ఛాయిస్ అని కితాబిచ్చాడు
